2, జులై 2026, గురువారం

నందా... నా మిత్రమా!" కథ








ఆ రోజు రేపల్లెలో సందడిగా, పండగ వాతావరణం నెలకొంది. వానలు కురిసి వెలియడంతో, గోవర్ధనగిరి పచ్చటి తివాచీ పరిచినట్లు, ఆకాశానికి సరికొత్త రంగులు అద్దినట్లు నయనానందకరంగా కనిపిస్తోంది.

నందుడు తన చద్దిమూటను భుజానికి తగిలించుకుని, గోవులను గోవర్ధనగిరికి తోలుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. అంతలోనే, అతని కంటే చిన్నదైన లతాంగి, "నేను కూడా నీతో పాటు గోవర్ధనగిరికి వస్తాను" అంటూ మారాం చేయసాగింది. మరోపక్క వటపత్రుడు, కుశంకుడు కూడా తయారై కిట్టయ్య రాక కోసం ఎదురుచూస్తున్నారు.

ఒక చేతిలో పిల్లనగ్రోవి, మరో చేతికి బంగారు కడియం మెరుస్తుండగా... గోవుల ముందర నడుస్తున్నాడు నల్లనయ్య. ఆ కిట్టయ్య వెనుక మిగిలిన ఆవులు, నందుడు మరియు గోపబాలురంతా కలిసి గోవర్ధనగిరి చేరుకున్నారు.

ఎప్పటిలాగే కిట్టయ్య గోవుల చుట్టూ ఒక కర్రతో గీత గీశాడు. ఆపై ఒక చెట్టు నీడన కూర్చొని, పిల్లనగ్రోవితో వినసొంపుగా మురళీగానం చేయసాగాడు. ఆశ్చర్యంగా ఆ గోవులన్నీ ఆ గీత లోపలే ఉంటూ ప్రశాంతంగా నెమరువేస్తున్నాయి. కిట్టయ్యకు ఎంతో ఇష్టమైన 'గోలక్ష్మి' అనే ఆవు తన దూడకు పాలు ఇస్తోంది. కానీ, మిగిలిన గోపబాలురు మాత్రం తమ మందలను ఎండలో నిలబడి మేపాల్సి వస్తోంది.

అలా కొన్ని రోజులు గడిచాయి. కిట్టయ్య ప్రతిరోజూ రావడం, గోవుల చుట్టూ కర్రతో గీత గీయడం, వేణుగానం చేయడాన్ని నందుడు నిశితంగా గమనించాడు.

ఒకరోజు నందుడు కూడా కిట్టయ్య లాగే తన మంద చుట్టూ కర్రతో గీత గీశాడు. కానీ, ఆ ఆవులు గీత లోపల ఉండకుండా చిందరవందరగా విడిపోయాయి. కిట్టయ్య గీసిన గీత దాటని ఆవులు, తమ గీతను మాత్రం అస్సలు లెక్కచేయడం లేదు. ఇది చూసి కొన్ని రోజుల పాటు గోపబాలురంతా కలిసి, కర్రలతో తమ గోవుల చుట్టూ పెద్ద గీతలే గీశారు. అయినా సరే, ఆవులు మాత్రం అటు ఇటు చెల్లాచెదురుగా వెళ్ళిపోతూనే ఉన్నాయి.

దీంతో విసిగిపోయిన నందుడు, గోపబాలురంతా కలిసి కృష్ణుడి దగ్గరకు వెళ్లి ఇలా అడిగారు: "కిట్టయ్యా! నీవు కర్రతో గీసిన గీతను ఆవులు దాటడం లేదు. కానీ మేము ఎన్నిసార్లు, ఎంత పెద్ద గీతలు గీసినా అవి నిలవడం లేదు, ఎందుకని?"

దానికి ఆ నందనందనుడు మందహాసం చేస్తూ, చిరునవ్వుతో ఇలా అన్నాడు: "చూడు నందా, నా మిత్రమా! ఈ సృష్టిలో ప్రతి జీవికీ దేనికదే ప్రత్యేకత ఉంటుంది. ఇతరులను అనుకరించడం, వారిలాగే జీవించాలనుకోవడం అసాధ్యం. ఆ అనుకరణే మనిషి దుఃఖానికి అసలైన కారణం అవుతుంది. నిన్ను నువ్వు తెలుసుకుని, నీలాగే నువ్వు జీవించి చూడు... అప్పుడే నీ జీవితంలో ఎంతో ఆనందం వెల్లివిరుస్తుంది."

కృష్ణుడి మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించిన గోపబాలురు పరమానందం చెందారు. అంతలోనే గోధూళి వేళ కావడంతో, గోవులను తీసుకొని అందరూ కలిసి సంతోషంగా ఇళ్లకు తిరుగుపయనమయ్యారు.


వెల్మజాల నర్సింహ.21.06.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నందా... నా మిత్రమా!" కథ

ఆ రోజు రేపల్లెలో సందడిగా, పండగ వాతావరణం నెలకొంది. వానలు కురిసి వెలియడంతో, గోవర్ధనగిరి పచ్చటి తివాచీ పరిచినట్లు, ఆకాశానికి సరికొత్త రంగులు అద...